రిజర్వేషన్లపై జనసేనాని సంచలన వ్యాఖ్యలు..
జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా కాపులు, ముస్లింల రిజర్వేషన్లకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓ ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అతను ముస్లిం రిజర్వేషన్ పై బీజేపీ నాయకులతో ఏకీభవిస్తున్నారా అన్న అనుమానాన్ని కలిగిస్తున్నాయి. కాపులకు, ముస్లింలకు అసలు రిజర్వేషన్ అవసరం లేదని జనసేనాని స్పష్టం చేశారు. అంతేకాదు పరోక్షంగా ఈ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చాలా కాలంగా రాష్ట్రంలో ముస్లింల రిజర్వేషన్లతో పాటు కాపులు కూడా తమకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇన్ని రోజులకి పవన్ ఈ విషయంపై తన మనసులోని మాటను బయట పెట్టారు. ఇలా కోరుకున్న వాళ్ళందరికీ రిజర్వేషన్లు ఇస్తూ పోవడం సాధ్యపడే పని కాదని కుండ బద్దలు కొట్టినట్టు క్లారిటీ ఇచ్చారు.
ఈ రిజర్వేషన్లు కల్పించడం కంటే కూడా ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించేలా ప్రోత్సహించడం మంచిది అని అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లు అమలు చేయడం కంటే కూడా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం.. నైపుణ్యం పెంచే విధంగా వివిధ అంశాలలో శిక్షణ ఇవ్వడం.. వారికి ఒక అవకాశాలు వచ్చేలా చూడడం రాష్ట్ర అభివృద్ధికి మంచిది అని సూచించారు. కొందరు జనసేనాని మాటలకు మద్దతు ప్రకటిస్తుంటే.. మరికొందరు రేపు ఎన్నికలపై అతని మాటలు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురంలో పవన్ విజయం కాపు సామాజిక వర్గానికి ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు రేపు ఓటింగ్ పై ప్రభావం చూపిస్తాయేమో అని విశ్లేషకులు భావిస్తున్నారు.