బాలయ్య కోసం కదలి వచ్చిన చిన్న కూతురు..
ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసింది.. ఇక ఓటర్లు తమ భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలి ఆ నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజశ్విని అభ్యర్థించారు. బాలకృష్ణ హిందూపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి ఆయన హ్యాట్రిక్ విక్టరీ కన్ఫామ్ అని అందరూ భావిస్తున్నారు. ఈరోజు తండ్రి తరఫున ప్రచారం సాగించిన తేజశ్విని.. సంక్షేమం లేక అభివృద్ధి.. ఈ రెంటిలో ఒకదాన్నే చేస్తూ పోతే జీవితంలో ఎప్పటికీ పైకి ఎదగలేమని పేర్కొన్నారు. హిందూపూర్ నియోజకవర్గంలో బుధవారం నాడు ఏర్పాటు చేసిన శ్రీ శక్తి సమావేశంలో ఓటర్లను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. సంక్షేమ పథకాలు ఇప్పుడు బాగుంటాయి.. కానీ రేపు భవిష్యత్తులో కారు కొనాల్సి వచ్చినా? ఇల్లు కట్టాల్సి వచ్చినా? ఏం చేస్తారు అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా అందించగలిగే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని.. అందుకే ఆయనకు ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత అందరూ ఓటర్లకి ఉంది అని తేజశ్విని పేర్కొన్నారు. బాలకృష్ణ హిందూపూర్ నియోజకవర్గం లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని.. స్థానికంగా ఎన్నో అభివృద్ధి పనులు నిర్వహించారని ఆమె గుర్తు చేశారు. తన తండ్రిని ఎంతో ఆదరించే హిందూపూర్ ప్రజలు ఈసారి కూడా తమ మద్దతు తండ్రికే ఇస్తారని ఆమె అన్నారు.