‘భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేసి చెప్పు’.. సీఎం రేవంత్కు ఎంపీ లక్ష్మణ్ సవాల్
బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను నీరుగార్చింది కాంగ్రెస్సేనని, రిజర్వేషన్లను వ్యతిరేకించిన చరిత్ర ఆ పార్టీదేనని బీజేపీ ఎంపీ లక్షణ్ అన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకొచ్చి ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ విసిరారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘బీసీలకు 27 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామంటే రాజీవ్ గాంధీ వ్యతిరేకించడం నిజమా..? కాదా..? కులాల ఆధారంగా రిజర్వేషన్లు వద్దని నెహ్రూ అప్పటి సీఎంలకు లేఖ రాసిన మాట వాస్తవమా..? కాదా..? ఈ విషయాలు రాహుల్ గాంధీ తెలుసుకోవాలి. అవేమీ తెలుసుకోకుండా రాహుల్ గాంధీ అసత్యాలు, అవాస్తవాలు మాట్లాడుతున్నారు. అంబేడ్కర్ ఆశయాలను నీరు గార్చింది కాంగ్రెస్సే. ఈ విషయమై రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే భాగ్యలక్ష్మి దేవాలయం వద్దకు వచ్చి ప్రమాణం చేసి చెప్పాలి’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డికి లక్ష్మణ్ సవాల్ విసిరారు.
అనంతరం ‘గాడిద గుడ్డు’ ఆరోపణలపై స్పందిస్తూ.. జూన్ 4 తరవాత కాంగ్రెస్కు మిగిలేది గాడిద గుడ్డేనని ఎద్దేవా చేశారు. దేశంలో ప్రస్తుతం 2 సిద్దాంతాల మధ్య పోటీ జరుగుతోందన్న లక్ష్మణ్.. దేశాభివృద్ధికి, కుటుంబ రాజకీయాలకు మధ్య జరుగుతున్న పోటీ ఇదని, చాయ్ వాలాకు ఆగర్భ శ్రీమంతుడికి మధ్య జరుగుతున్న పోటీ అని వ్యాఖ్యానించారు.