హైదరాబాద్ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారు: కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ దిగజారుతోందని, రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతింటోందని తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ను కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్జాతీయంగా దిగజారుస్తోందని, కరెంటు కోతలు, నీళ్ల కష్టాల వల్ల వేల కోట్ల విలువ చేసే పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతున్నాయని, రావల్సిన పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని దుండిగల్లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రోడ్షోలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘రాష్ట్రం ప్రతిష్టపోతోంది. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్నింగ్ అనే పరిశ్రమ రూ.1000కోట్లతో పెట్టుబడులతో వస్తే అది ఇప్పుడు మద్రాస్కి తరలిపోయింది. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక పరిశ్రమలు తరలిపోతున్నాయి. అసలు హైదరాబాద్లాంటి నగరంలో కరెంటుపోవడం, మంచినీళ్లు రాకపోవడం ఏంటి? ఇలాంటి చర్యలతో నగర బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయంగా పడగొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనలు చేస్తోంది’’ అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా ఒకప్పుడు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా సాగేదని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్సులు వసూలు చేస్తున్నారని ఏకంగా ప్రధాని మోదీనే ఆరోపిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలని ప్రజలకు కేసీఆర్ సూచించారు.