మోదీ పార్టీతో ఏమన్నా పైసా లాభమైనా ఉందా?: కేసీఆర్ సెటైర్
మోదీ పాలనలో రూపాయి విలువ డాలర్తో పోలిస్తే రూ.84కి పడిపోయిందని, ఏ ప్రధానమంత్రి కాలంలో దిగజారనంతగా దిగజారిపోయిందని తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ పార్టీతో పైసా లాభం లేదని, పెట్టుబడులు పోయాయని, పరిశ్రమలు మూతపడ్డాయని విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్లో నిర్వహించిన రోడ్షోలో భాగంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎజెండాలో పేదల గోసలు, రైతుల బాధలను పోగొట్టే ఆలోచన ఉండదన్న కేసీఆర్.. ‘‘మోదీ పాలనలో దేశం ఆర్థికంగా పూర్తిగా దెబ్బతింటోంది. పెట్టుబడులు పోయాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఎల్ఐసీని ముంచే ప్రయత్నం చేస్తున్నారు. పబ్లిక్ సెక్టార్ అంతా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇదేనా సబ్ కా వికాస్ అంటే?’ అంటూ మండిపడ్డారు.
‘ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే.. 750 మంది రైతులు చనిపోయారు. వారి చావుకు కారణం మోదీ. అంటే రైతులను చంపిన వ్యక్తి నరేంద్ర మోదీ. మళ్లీ యూపీ ఎన్నికలు వస్తే సారీ చెప్పి.. మాఫీ చెప్పి వేడుకున్న వ్యక్తి మోదీ. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, మేథావులు దీనిపై ఆలోచన చేయాలని నా మనవి. ఈ రాష్ట్రం, ఈ దేశం మనది. భవిష్యత్ మనది. దయచేసి ఆలోచించి ఓటు వేయండి’’ అంటూ మోదీపై కేసీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు.