బీజేపీ జేబు సంస్థగా ఎన్నికల కమిషన్.. జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్
దేశంలో ప్రజలంతా ఫిక్స్ అయ్యారని, దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనేనని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు రావడమే ఆలస్యమని, వెంటనే రాహుల్ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. మంగళవారం గాంధీభవన్లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో పాటు ఎన్నికల కమిషన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్.. బీజేపీ జేబు సంస్థగా వ్యవహరిస్తోందన్నారు. మోదీ మాటిమాటికీ కోడ్ ఉల్లంఘిస్తున్నా, ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీల జీవితాల్లో వెలుగులు వస్తాయని, దేశ వ్యాప్తంగా ప్రజలంతా రాహుల్కు అండగా ఉన్నారనే భయంతోనే కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టాలని మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శలు చేశారు.
అనంతరం గాంధీ భవన్లోకి ఢిల్లీ పోలీసులు రావడంపై స్పందించిన జగ్గారెడ్డి.. మోదీ, అమిత్షాల ఆదేశాల మేరకే గాంధీభవన్కు ఢిల్లీ పోలీసులు వచ్చారన్నారు. గాంధీభవన్కి ఢిల్లీ పోలీసులను స్వయంగా అమిత్ షా పంపించాడండే బీజేపీ ఎంతలా భయపడుతోందో అర్ధం చేసుకోవాలన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా మోదీ అబద్ధాలు చెబుతున్నారని, ఆ అబద్ధాలనే నిజాలన్నట్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాళి బొట్టు తెంచి ముస్లింలకు ఇస్తారంటూ ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్ మైండ్తో అధికారం కోసమే మోదీ దిగజారుతున్నారని ఘాటు ఆరోపణలు చేశారు.