ఏపీలో మళ్లీ జగనే సీఎం.. కేసీఆర్..
ఆంధ్రాలో ఇప్పుడు ఎన్నికల టెన్షన్ మామూలుగా లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కాబోయే ఆంధ్ర రాష్ట్ర సీఎం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ప్రస్తుతం అందరిని కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. గత ప్రభుత్వాలు భూమిని తమ ఇష్టానుసారం చిక్కుల్లో పెట్టి.. రైతులను రాచిరంపాన పెట్టాయని కేసీఆర్ ఆరోపించారు. భూమి ఎవరిదో కూడా తెలియని కన్ఫ్యూషన్ లో ప్రజలను నెట్టి.. లక్షల కోట్లు దండుకున్నారని ఆయన మండిపడ్డారు. సాక్షి న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడారు. తెలంగాణలో తమ ప్రభుత్వం తెచ్చిన ధరణి పద్ధతి ద్వారా చాలా మేలు జరిగిందని. ధరణి వచ్చిన తర్వాత వేరొకరి భూమిని తాకే ఆస్కారం ఎవరికీ లేకుండా పోయిందని కేసీఆర్ అన్నారు. రైతు స్వయంగా తన వేలిముద్ర వేస్తే తప్ప ల్యాండ్ టైటిల్ మారదు అని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎవరూ మన భూములను కాజేయరని.. అది మన భూమికి రక్షణ కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ధరణిపై ఇటు బీజేపీ.. అటు కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని కేసీఆర్ అన్నారు. అదే రకంగా ఆంధ్రాలో కూడా జగన్ పై ప్రజలలో అపనమ్మకం కలిగించడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ప్రతిపక్షాలు ఆయుధంగా ఉపయోగిస్తున్నాయని.. కానీ వారు అనుకున్నది ఏదీ జరగదని.. రెండవసారి కూడా ఆంధ్రాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జగన్ సీఎం అవుతారని కేసీఆర్ పేర్కొన్నారు.