కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే.. ఎన్నారై మంత్రిత్వ శాఖ ఏర్పాటు
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేకంగా ఎన్నారై మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) కార్యదర్శి డాక్టర్ ఆరతి కృష్ణన్ తెలిపారు. ఐఓసీ నాయకులు మహీందర్ సింగ్, ప్రదీప్ సామల, గంపా వేణుగోపాల్, రాజేశ్వర్ రెడ్డి, భీమ్ రెడ్డి తదితరులలో కలిసి ఆమె గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ఎన్నారైల సమస్యలు మోదీ సర్కార్ పట్టించుకోలేదని, ప్రత్యేకంగా ఎన్నారై మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, న్యాయ్ యాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నారన్నారు. ఇక్కడి నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు సైతం పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొనాలని, కాంగ్రెస్కు మద్దతివ్వాలని కోరారు. తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తోందన్నారు. గంపా వేణుగోపాల్, రాజేశ్వర్ రెడ్డి, భీమ్ రెడ్డిలు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో రైతుల సిబిల్ స్కోర్ పడిపోయిందని, దీంతో ఎన్నారైల పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కాంగ్రెస్ గెలిస్తే సిబిల్ స్కోర్ పెంచేందుకు కృషి జరుగుతుందన్నారు.