కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే: హరీశ్ రావు
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. బీజేపీతో పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, మైనార్టీల సంక్షేమానికి తమ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. సిద్దిపేటలో గురువారం నిర్వహించిన ముస్లిం మైనార్టీల సమావేశంలో పాల్గొన్న ఆయన.. బీజేపీ, కాంగ్రెస్లపై నిప్పులు చెరిగారు. బీజేపీతో చేతులు కలిపిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని కుట్ర చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిగానే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎవరూ మీకు అందుబాటులో ఉండరని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండేది కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులే అని అన్నారు.
అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించిన హరీశ్ రావు.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు గడుస్తున్నా 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ అధికారంలో రాగానే కేసీఆర్ కిట్టు పోయింది. షాదీ ముబారక్ బంద్ అయ్యింది. తులం బంగారం జాడ లేకుండా పోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా రివర్స్ గేర్లో నడుస్తోంది’’ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లు మాటలు చెప్పడం తప్ప, మైనార్టీలకు రూపాయి ఇవ్వలేదని ఆరోపించిన హరీశ్ రావు.. బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్లో రూ.4 వేల కోట్లు కేటాయించిందని, మైనార్టీల పిల్లల చదువుల కోసం రెసిడెన్షియల్ సూళ్లను 204కు పెంచిన ఘనత కూడా కేసీఆర్దేనని గుర్తు చేశారు.