ప్రపంచంలోనే అతిపెద్ద టెర్మినల్..
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అభివృద్ధి దశలో ఉన్న దుబాయ్ వరల్డ్ సెంట్రల్లోని అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్లతో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు. వచ్చే పదేళ్లలో కార్యకలాపాలన్నీ అక్కడ నుంచే సాగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు దుబాయ్ పాలకుడు ప్రకటించారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద టెర్మినల్గా నిలువనుంది. కొత్తగా నిర్మించనున్న టెర్మినల్ను అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పిలుస్తారు.
దుబాయ్లో త్వరలో ప్రపంచ ఎయిర్పోర్టు, పోర్టు, అర్బన్ హబ్, న్యూ గ్లోబల్ సెంటర్ అందుబాటులోకి రానున్నాయని దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వెల్లడించారు. తదుపరి కార్యకలాపాలు అక్కడనుంచే సాగుతాయని, భవిష్యత్తుతరాల కోసం ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని తెలిపారు. ఏడాదికి 26కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా కొత్త ఎయిర్పోర్టును అభివృద్ధి చేస్తోంది దుబాయ్ ప్రభుత్వం.
ప్రస్తుతం ఉన్న విమానాశ్రయ విస్తీర్ణంతో పోలిస్తే ఇది ఐదు రెట్లు పెద్దదిగా మారనుంది.. ఇప్పుడు రెండు రన్వేలు మాత్రమే ఉన్నాయి. కొత్త ఎయిర్పోర్ట్లో 400 ఎయిర్క్రాఫ్ట్ గేట్లు, ఐదు సమాంతర రన్వేలు ఉంటాయి. ఎయిర్ పోర్టు నిర్మాణంలో సరికొత్త టెక్నాలజీని వినియోగించనున్నారు. దక్షిణ దుబాయ్లో చేపడుతున్న ఈ ఎయిర్పోర్టు చుట్టూ నగరం నిర్మాణం కాబోతోంది. లాజిస్టిక్, ఎయిర్పోర్టు రంగంలో అతిపెద్ద కంపెనీలకు ఇది కేంద్రంగా మారనుంది.