రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి
ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను రద్దు చేసేందుకే అమిత్ షా, నరేంద్ర మోదీ దేశం అంతటా చక్కర్లు కొడుతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం.. నేడు బీజేపీ కారణంగా ప్రమాదంలో పడిందని, దానివల్ల రాజ్యాంగం ప్రకారం బడుగు, బలహీన వర్గాలకు దక్కిన రిజర్వేషన్లు కూడా ప్రమాదంలో పడ్డాయని సీఎం ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ సరూర్నగర్ జన జాతర సభలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికలు దేశ ప్రజలకు జీవన్మరణ సమస్యగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో మత చిచ్చు రేపడమే బీజేపీ ధ్యేయమని, అలాంటి పార్టీని ప్రజలే తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
బీజేపీ అన్యాయాలను, అకృత్యాలను తుదముట్టించేందుకు మోదీ, అమిత్ షాలపై రాహుల్ గాంధీ యుద్ధం ప్రకటించారన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు రాహుల్ గాంధీకి అండగా నిలబడాలని, అప్పుడే రిజర్వేషన్లను కాపాడుకోగలుగుతామని అన్నారు. అనంతరం బీజేపీ ఎంపీ నవనీత్ రాణా వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్.. ‘‘15 సెకన్ల సమయమిస్తే మైనార్టీలను లేకుండా చేస్తామంటూ తెలంగాణకు వచ్చిన ఓ బీజేపీ ఎంపీ మాట్లాడారు. ఇదెక్కడి న్యాయమో మోదీయే సమాధానం చెప్పాలి. మత కలహాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. హైదరాబాద్లో మత చిచ్చు పెట్టాలని చూస్తున్న బీజేపీకి ప్రజలే తమ ఓటుతో బుద్ధి చెప్పాలి’’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.