పద్మవిభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి, సీనియర్ నటి ప్రఖ్యాత భరత నాట్య కళాకారిణి వైజయంతిమాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేశారు. మరో 9 మందికి పద్మభూషణ్, 55 మందికి పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులకు ప్రకటించిన పద్మ అవార్డుల రెండ విడత ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
పద్మశ్రీ అవార్డులు అందుకున్న వారిలో తెలంగాణకు చెందిన ఆలయాల రూపశిల్పి వేలు ఆనందాచారి, తెలుగు, సంస్కృత భాషల్లో తొలి హరికథ కళాకారిణిగా పేరొందిన దాలివర్తి ఉమామహేశ్వరి, ప్రముఖ కవి, రచయిత కూరెళ్ల విఠలాచార్య ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఐదుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ కలిపి మొత్తం 132 మందికి ఈ పౌరపురస్కారాలు ప్రకటించిన విషయం తెలిసిందే.