ఛలో పిఠాపురం పై మెగాస్టార్ క్లారిటీ..
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అలాగే జోరుగా సాగుతున్న ప్రచారాలు కూడా శనివారంతో ముగిసిపోతాయి. ఇక కేవలం ప్రచారానికి ఒక్కరోజు మిగలడంతో పార్టీలు యుద్ధ ప్రాతిపదికన ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేస్తారు అన్న ప్రచారం గత కొద్ది కాలంగా బలంగా జరుగుతుంది. అయితే తాజాగా దీనిపై మెగాస్టార్ స్పందించారు. గురువారం నాడు రాష్ట్రపతి భవన్ లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న చిరంజీవి.. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న చిరంజీవి మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను అని చిరంజీవి స్పష్టం చేశారు. అంతేకాదు పిఠాపురంలో ప్రచారంపై స్పందిస్తూ.. రేపు పిఠాపురం వెళ్లడం లేదని.. పవన్ కూడా తనని ప్రచారానికి రమ్మని పిలవలేదని స్పష్టం చేశారు. తన మనోభావాలు తమ్ముడికి బాగా తెలుసని.. అందుకే ప్రచారానికి రమ్మని తనపై ఒత్తిడి కూడా తీసుకు రాలేదని చిరంజీవి పేర్కొన్నారు. తాను పిఠాపురం వెళుతున్నాను అని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన క్లారిటీ ఇచ్చారు.