మాయవతి కీలక నిర్ణయం... తన రాజకీయ వారసుడిని
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయవతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ సమన్వయకర్తగా తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆయన పూర్తిస్థాయి పరిపక్వత సాధించే వరకు అన్ని బాధ్యతల నుంచి దూరంగా ఉంచుతున్నట్లు మాయవతి ప్రకటించారు. బీఎస్పీ ఒక పార్టీ మాత్రమే కాదు. ఆత్మగౌరవం, సామాజిక మార్పు కోసం అంబేద్కర్ చేసిన ఉద్యమానికి కొనసాగింపు. కాన్షీరామ్, నేను జీవితం మొత్తాన్ని దానికోసమే అంకితం చేశాం. కొత్తతరాన్ని కూడా అందుకు సిద్ధం చేస్తున్నాం. ఈ క్రమంలో పార్టీలో కొత్త వ్యక్తులను ప్రోత్సహించడం కోసం ఆకాశ్ ఆనంద్ను జాతీయ సమన్వయకర్తగా, ఉత్తరాధికారిగా ప్రకటించాం. అయితే పార్టీ ఉద్యమ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, పూర్తి పరిపక్వత సాధించే వరకు ఆయన్ని కీలక బాధ్యతల నుంచి దూరంగా ఉంచుతున్నాం. అప్పటి వరకు ఆయన తండ్రి ఆనంద్ కుమార్ పార్టీలో కీలక బాధ్యతలను నిర్వరిస్తారు అని తెలిపారు.