చిప్ కంపెనీకి రూ.55,000 కోట్లు ..బైడెన్ ప్రభుత్వ ప్రకటన
అమెరికాలో చిప్ ప్లాంట్ల విస్తరణ నిమిత్తం తైవాన్కు చెందిన తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీకి 6.6 బి.డాలర్ల (దాదాపు రూ.55,000 కోట్ల) నిధులు అందించాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఫీనిక్స్లో ఈ కంపెనీ నిర్మిస్తున్న రెండు ప్లాంట్లను విస్తరించడంతో పాటు కొత్తగా మరో ప్లాంటు నిర్మించడానికి ఈ నిధులను ఇవ్వనున్నట్లు వాణిజ్య మంత్రి జినా రేమాండో తెలిపారు. తమ మిలటరీ, జాతీయ భద్రతకు చిప్ తయారీ అత్యంత కీలకమని అన్నారు. కరోనా పరిణామాల్లో చిప్ సరఫరాలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, అమెరికా చిప్ తయారీ ప్లాంట్లకు ప్రాధాన్యమిస్తోంది. 280 బి. డాలర్ల ప్యాకేజీతో చిప్స్, సైన్స్ యాక్ట్ను 2022లో తీసుకొచ్చింది. తద్వారా మిలటరీ టెక్నాలజీ, తయారీకి గట్టి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఫీనిక్స్లో రెండు ప్రాజెక్ట్లకు 40 బి.డాలర్లు, మూడో ప్లాంటుకు 25 బి. డాలర్ల చొప్పున మొత్తం 65 బి.డాలర్లను ఆ కంపెనీ పెట్టుబడులుగా పెడుతోందని మంత్రి వివరించారు.