‘15 సెకన్లు కాదు.. ఓ గంట ఇవ్వండి మోదీజీ’.. నవనీత్ రాణా వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్
15 సెకన్ల పాటు పాటు పోలీసులను పక్కనపెడితే తామేం చేయగలమో చూపిస్తామంటూ బీజేపీ ఎంపీ నవనీత్ రాణా చేసిన వ్యాఖ్యలకు ఏఐఎంఐఎం అధ్యక్షుడు అక్బరుద్దీన్ ఓవైసీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నవనీత్ వ్యాఖ్యలపై గురువారం స్పందించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. నవనీత్ రాణాకు 15 సెకన్ల సమయం ఇవ్వాలని ప్రధాని మోదీని కోరుతున్నానన్నారు. ‘‘మోదీజీ నవనీత్ రాణాకు 15 సెకన్లు కాదు, ఓ గంట ఇవ్వండి, వాళ్లు ఏం చేస్తారో మాకు కూడా చూడాలని ఉంది. ఇక్కడెంత మానవత్వం మిగిలుందో మేమూ చూస్తాం. ఇక్కడ ఎవరూ భయపడడం లేదు’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా అధికారం వాళ్ల చేతుల్లో ఉందని, ఆయుధం వాళ్ల చేతుల్లో ఉందని ఆరోపించిన ఓవైసీ.. ‘‘ముఖ్తార్ అన్సారీని తుదముట్టించినట్లు మమ్మల్ని కూడా అంతం చేస్తారా..?’’ అంటూ ప్రశ్నించారు.
కాగా.. దాదాపు 11 ఏళ్ల క్రితం ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన బీజేపీ ఎంపీ నవనీత్ రాణా కూడా వివాదాస్పద రిప్లై ఇచ్చారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీ లత తరపున ప్రచారం చేసే క్రమంలో ఓ ర్యాలీలో మాట్లాడిన నవనీత్ రాణా.. ‘‘కాంగ్రెస్కు కానీ, ఎంఐఎంకు కానీ ఓటేస్తే, పాకిస్థాన్కు అనుకూలంగా ఓటేసినట్లే. హైదరాబాద్ పాకిస్థాన్గా మారకుండా ఉండాలంటే బీజేపీ అభ్యర్థి మాధవీ లత గెలిచి తీరాలి. అప్పట్లో ఛోటే (అక్బరుద్దీన్ని ఉద్దేశించి) 15 నిముషాలిస్తే మేమేం చేస్తామో చూపిస్తామన్నాడు కదా.. అయితే వాళ్లకి 15 నిముషాలు కావాలేమో. మాకు 15 సెక్షన్లు సరిపోతాయి. 15 సెకన్ల పాటు పోలీసులను పక్కనపెడితే.. బడేభాయ్, ఛోటేభాయ్లకు ఎక్కడినుంచి వచ్చామో, ఎక్కడికి పోతున్నామో కూడా తెలియకుండా పోతుంది’’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా రాణా తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. ఆ పోస్టును ఓవైసీ సోదరులకు కూడా ట్యాగ్ చేశారు.