‘నీలా ఏడవను.. తేల్చుకుంటా..’ సీఎం రేవంత్కు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్
తెలంగాణ పోలీసులు తనపై కేసు నమోదు చేయడంపై బీజేపీ అగ్రనేత అమిత్ షా ఘాటు విమర్శలు చేశారు. తనపై సీఎం రేవంత్ రెడ్డి కేసు పెట్టించారని, అయితే తాను రేవంత్లా ఏడవనంటూ సంచలన కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాడు సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ మధ్య తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాపై కేసు పెట్టించారు. కానీ నేను రేవంత్ రెడ్డిలాగా ఏడవను. హైకోర్టులోనే తేల్చుకుంటా’’ అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అలాగే కేంద్ర పార్టీ ఆదేశాలతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అవినీతికి పాల్పడుతున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనను వాడుకుని వదిలేస్తుందని అన్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా మార్చుకుందని ఆరోపించిన అమిత్ షా.. రాహుల్, రేవంత్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఏబీసీ అంటే.. అసదుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని, వీళ్లంతా ఒకటేనని విమర్శించారు.
కాగా.. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల హైదరాబాద్ నియోజకవర్గ పరిధిలో కొద్ది రోజుల క్రితం అమిత్ షా ఓ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలోనే ఆయన ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించారని, ప్రచారంలో చిన్నపిల్లలను ఉపయోగించారంటూ కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. అమిత్ షాతో పాటు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిని మాధవీలతపై కూడా కేసు నమోదైంది.