వలసవాసులపై అమెరికా టియర్ గ్యాస్
మెక్సికో సరిహద్దుల నుంచి దేశంలోకి వెల్లువెత్తుతున్న వలసవాసులను అడ్డుకునేందుకు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ దళాలు వారిపైకి బాష్పవాయుగోళాలను ప్రయోగించాయి. కొత్త సంవత్సరం ఆరంభమైన కొద్ది గంటల్లోనే దాదాపు 150 మంది వలసవాసులు మెక్సికో సరిహద్దుల్లోని టిజువానా వద్ద ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను తొలగించి అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించారని, వారిని అడ్డుకునేందుకు తాము బాష్పవాయు గోళాలను ప్రయోగించామని కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్స్ ఫోర్స్ ఒక ప్రకటనలో వివరించింది. అయితే ఈ బాష్పవాయు గోళాల ప్రభావం సరిహద్దు ఫెన్సింగ్ వద్ద ఉన్న వలసవాసులు, చిన్నారులపై ఏ మాత్రం ప్రభావం లేదని, భద్రతా దళాలు తమపై రాళ్లు రువ్వుతున్న వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ బాష్పవాయు గోళాలను ప్రయోగించాయని ఆ ప్రకనటలో వివరించారు. టిజువానా పట్టణం వద్ద మెక్సికో వైపు ప్రయోగించిన బాష్పవాయుగోళాలతో పలువురు మహిళలు, చిన్నారులతో సహా అనేక మంది వలస వాసులు, జర్నలిస్టులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని మీడియా ప్రతినిధులు తమ వార్త కథనాలలో వెల్లడించారు.