మనల్ని చూసి జనం నవ్వుకుంటున్నారు
పార్లమెంటు సభ్యులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ సభ్యులు రభస సృష్టిస్తున్న నేపథ్యంలో నిర్మాణాత్మకంగా పని చేయాలని వారిని కోరారు. పార్లమెంటు ప్రతిష్ట దెబ్బ తింటోందన్నారు. రాజ్యసభలో కొందరు సభ్యులు యథేచ్చగా నినాదాలు చేస్తున్నపుడు వెంకయ్య నాయుడు ఘాటుగా స్పందించారు. శీతాకాల సమావేశాల్లో మిగిలిన కాలంలో సజావుగా సమావేశాలు జరిగేందుకు సహకరించాలని కోరారు.
డిసెంబరు 11 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. నెలరోజులపాటు ఉభయ సభలు సమావేశమవుతాయి. పార్లమెంటు వెలుపల, లోపల అధికార, ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ట్రిపుల్ తలాక్ బిల్లు, రఫేల్ డీల్ వంటివాటిపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు అధికార పక్షంపై విరుచుకుపడుతున్నాయి. సమావేశాలు సజావుగా సాగడం లేదు. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.