జనవరి 1 నుంచి నుమాయిష్ ప్రారంభం
జనవరి 1 వ తేదీ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ ప్రారంభం కానుంది. మాజీ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ ఈటల రాజేందర్ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులతో సమావేశమై నూమాయిష్ పై చర్చించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ జనవరి 1న నుమాయిష్ ను హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభిస్తారని తెలిపారు. నుమాయిష్ 45 రోజుల పాటు కొనసాగనుంది. నుమాయిష్ ను 78 సంవత్సరాలుగా ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. చాలా ప్రాచుర్యం పొందిన నుమాయిష్ ను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు వస్తారని తెలిపారు. నుమాయిష్ లో 2500లకు పైగా దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గల చిరు వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. నుమాయిష్ లో తమ స్టాల్ ఉండాలని వ్యాపారులు కోరుకోవడం తమ ఘనత అన్నారు.
ఈసారి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు మెట్రో అనుసంధానం కావడం లాభదాయకమన్నారు. ఇక్కడ ఉచిత పార్కింగ్ సదుపాయం సైతం కలదన్నారు. ఎగ్జిబిషన్ ప్రాంతంలో నాలుగంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వైద్య సేవలు అందించేందుకు యశోద గ్రూప్ సంస్థలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఎగ్జిబిషన్ ద్వారా అందే డబ్బుతో 18 కళాశాలల్లో నాణ్యమైన విద్యకు కృషి చేస్తున్నామని ఈటల సృష్టం చేశారు.