విశాఖలో మరో జాతీయ ఐటీ సదస్సు
విశాఖ మరో జాతీయ సదస్సుకు వేదికవుతోంది. కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలపై ఈ నెల 5-6 తేదీల్లో నగరంలో జాతీయ స్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్టు కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా(సిఎస్ఐ) విశాఖ చాప్టర్ చైర్మన్ ప్రబీర్రామ్ చౌదరి తెలిపారు. వచ్చే 15 సంవత్సరాల్లో కంప్యూటర్ రంగంలో అనేక భారీ మార్పులు వస్తాయన్నారు. వాటిపై నేటి తరానికి అవగాహన కల్పించే లక్ష్యంతో విశాఖపట్నం ఉక్కు కర్మాగారం సౌజన్యంతో హోటల్ గేట్వేలో ఇంపాక్ట్ -2018 పేరిట జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేశ్, ప్రొఫెసర్ విశ్వనాథం తదితరులు హాజరవుతారన్నారు. కృత్రిమ మేధస్సు (ఎఐ) ఎనలిటిక్స్, బ్లాక్ చెయిన్, ఐఒటి వంటి అధునిక టెక్నాలజీలపై నిపుణులు సదస్సులో వివరిస్తారన్నారు. కంప్యూటర్ రంగంలో రానున్న మార్పులపై నేటి యువతరానికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సమావేశంలో పాల్గొన్న ఆర్ఎన్ఐఎల్ జనరల్ మేనేజర్ కేవీఎస్.రాజేశ్వరరావు తెలిపారు.