సమస్యల పరిష్కారానికి ఏడాదిపైనే పడుతుంది: ఫేస్ బుక్
వినియోగదారుల సమాచారం లీకేజీతోపాటు మరికొన్ని సమస్యలతో గత కొంత కాలంగా ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ చిక్కులో పడ్డ సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా పలువురు నేతలు, ప్రైవసీ అడ్వకేట్లు, ఇన్వెస్టర్లు కూడా ఫేస్బుక్పై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు. సృష్టంగా చెప్పాలంటే ప్రస్తుతమున్న సమస్యలను పరిష్కరించేందుకు ఏడాది కంటే ఎక్కువ సమయం పడుతుంది అని పోస్ట్లో పేర్కొన్నారు. ఇందులోనూ ఎన్నికల్లో జోక్యం, ప్రమాదకరమైన ప్రసంగాలు తదితర అంశాలు పూర్తిగా పరిష్కారం కావని పేర్కొన్నారు. ఇప్పుడు ఫేస్బుక్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుందని, సమస్యల పట్ల ఎక్కువగా చొరవ తీసుకొని చర్యలు చేపడుతుందని జుకర్బర్గ్ తెలిపారు. ఎలాంటి హాని జరగకుండా అడ్డుకునేందుకు తమ సేవలన్నింటిపైనా ఇంకా ఎక్కువ దృష్టి పెట్టి పనిచేస్తామని పోస్ట్లో చెప్పుకొచ్చారు.