ఈపీఎఫ్ ఓ ఖాతాదారులకు శుభవార్త
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులకు శుభవార్త. ఈపీఎఫ్కు వడ్డీ రేటును పెంచనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటును 8.55 శాతం నుంచి పెంచాలని భావిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించినట్లు ఓ మీడియా నివేదికలో వెల్లడించారు. అయితే వార్షిక అంతర్గత సమీక్షా సమావేశంలో ఈపీఎఫ్ఓ వడ్డీరేటు పెంపుపై నిర్ణయం తీసుకోనుందని తెలిపింది. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేటు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు పెంచితే దాదాపు 6 కోట్ల మంది ఖాతాదారులకు లాభం చేకూరనుంది.
2019లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉద్యోగులకు లాభం చేకూర్చేందుకు వడ్డీ రేటు పెంచే అవకాశం ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. వడ్డీ రేటు పెంపు గురించి ఈ నెలాఖరుకి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా డిసెంబరు నెలాఖరులోగా వడ్డీరేటుపై నిర్ణయం తీసుకుంటారని, కానీ ఈసారి అకౌంట్ ఆడిట్లు పూర్తి కాకపోవడం వల్ల ఆలస్యమైందని సంబంధిత అధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న వడ్డీరేటు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.