సీఎం కేసీఆర్ మరో యాగం ?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో బృహత్తర యాగాన్ని తలపెట్టారు. ఎన్నికల్లో గెలుపు, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా కిందట నెలలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు కేసీఆర్. రాష్ట్రాభివృద్ధి, లోకకల్యాణం నిమిత్తం ఆయన మహారుద్ర సహిత సహస్ర చండీ మహా యాగం చేయనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి సమీపంలో ఉన్న తన వ్యవసాయక్షేత్రంలో జనవరి 21 నుంచి 25 దాకా ఈ మహాయాగాన్ని నిర్వహించనున్నారు. మూడేళ్ల క్రితం వైభవోపేతంగా నిర్వహించిన అయుత చండీ మహాయాగం మాదిరిగానే, ఈసారి కూడా శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థ స్వామి ఆశీస్సులతో, శృంగేరీ శారదాపీఠం సంప్రదాయంలోనే ఈ మహాయాగాన్ని నిర్వహించనున్నారు. చతుర్వేద పండితుడు, జ్యోతిరాప్తో ర్యామ యాజీ, మాణిక్య సోమయాజి, నరేంద్ర కాప్రే, పురాణం మహేశ్వర శర్మ, ఫణిశశాంక శర్మ తదితరుల ఆధ్వర్యంలో జరిగే ఈ మహాక్రతువులో 200 మంది రుత్విక్కులు పాల్గొననున్నారు. విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. యాగ నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాణిక్య సోమయాజితో చర్చలు జరిపినట్టు సమాచారం.
ఏకోత్తర వృద్ధి సంప్రదాయంలో జరిగే సహస్ర చండీయాగంలో తొలిరోజు వంద సప్తశతి చండీ పారాయణాలు, రెండో రోజు 200, మూడో రోజు 300, నాలుగో రోజు 400 పారాయణాలు చేస్తారు. అన్నీ కలిపితే వెయ్యి పారాయణలవుతాయి. ఐదో రోజు 11 యజ్ఞకుండాల వద్ద.. ఒక్కో యజ్ఞకుండం వద్ద 11 మంది రుత్విక్కులతో 100 పారాయణాల స్వాహాకారాలతో హోమం నిర్వహిస్తారు. అనంతరం పూర్ణాహుతితో యాగం పరిసమాప్తమవుతుంది.