Trump: ప్రపంచంపైనా ట్రంప్ ట్రేడ్ వార్..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసలు సిసలైన ప్రకటన చేశారు. ఇప్పటివరకూ పది, పదిహేను దేశాలపైనా ట్యాక్సులు అన్నట్లుగా వ్యవహరించిన ట్రంప్.. ఇప్పుడు అసలైన వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. వాణిజ్య యుద్ధం కేవలం 10-15 దేశాలకు మాత్రమే పరిమితం కాబోదని.. ప్రపంచంలోని అన్ని దేశాలపైనా సుంకాలు విధిస్తామని అన్నారు. ఈ విషయంలో ఎటువంటి మార్పు ఉండదన్నారు. అగ్రరాజ్యం తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలంటే ఈ చర్యలు తీసుకోక తప్పదని వ్యాఖ్యానించారు.
‘‘చాలా ఏళ్లుగా మేము ప్రపంచదేశాలతో ఉదారంగా వ్యవహరించాము. కానీ చరిత్రలో ఏ దేశాన్ని దోచుకోనివిధంగా అవి అమెరికాను దోచుకున్నాయి. వాణిజ్య పాలసీల విషయంలో కొన్ని సార్లు అమెరికా మిత్రదేశాలు శత్రువుల కంటే దారుణంగా ప్రవర్తించాయి. దశబ్దాలుగా వారు మనపై విధించిన, వివిధ పేర్లతో దోచుకున్న దానికంటే ప్రస్తుతం అగ్రరాజ్యం ఇతర దేశాలపై విధిస్తున్న సుంకాలు చాలా తక్కువ. కాబట్టి ప్రత్యక్షంగా, పరోక్షంగా మాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న ప్రపంచదేశాలన్నిటిపైనా మా వాణిజ్య టారిఫ్లు అమలవుతాయి’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఏప్రిల్ 2 నుంచి అమలయ్యే ప్రతీకార సుంకాలను తప్పించుకునేందుకు అమెరికా దిగుమతులపై టారిఫ్ కోతల వైపు భారత్ మొగ్గుచూపుతోంది. ఈక్రమంలో రెండు దేశాల మధ్య మొదలైన ట్రేడ్ అండ్ టారిఫ్ చర్చల్లో (India-US Tariff Talks) భారత్(india) ధృఢవైఖరిని ప్రదర్శిస్తోంది. కొన్ని వస్తువులపై టారిఫ్ కోతలకు అంగీకరించినప్పటికీ.. దేశ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తోంది. ‘‘సుంకాలు తగ్గించినంత మాత్రాన అమెరికా ఒత్తిడికి లొంగిపోయినట్లు కాదు’’ అని ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారి పేర్కొన్నారు.
మరోవైపు అమెరికా నుంచి మన దేశంలోకి వస్తున్న ఉత్పత్తులపై ఇక్కడ ఎంత సుంకం విధిస్తే, ఇక్కడినుంచి అమెరికాకు చేరుతున్న అదేతరహా ఉత్పత్తులపై సమాన సుంకాన్ని ఏప్రిల్ 2 నుంచి అమలుచేస్తామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రకారం.. భారత ఉత్పత్తులపై అమెరికా సగటున 2.2% సుంకం విధిస్తుండగా.. అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకం సగటు 12 శాతంగా ఉంది.