దోచుకోవడానికి వారికి ఏమైనా లైసెన్స్ ఉందా? : మోదీ

అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో కాంగ్రెస్ పార్టీ తనపై విమర్శలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కుటుంబ పాలన సాగించేవారిలో అభద్రతా భావం ఎక్కువని తెలిపారు. సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో మోదీ మాట్లాడారు. విదేశాల్లో తెలుగు ప్రజలకు కీలక భూమిక పోషిస్తున్నారన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కుటుంబ పార్టీలు పాలించాయి. ఆ పార్టీలు ఉన్నచోట ఆయా కుటుంబాలు బాగుపడ్డాయి. దోచుకోవడానికి వారికి ఏమైనా లైసెన్స్ ఉందా? వాసరత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నాం. కుటుంబ పార్టీల వల్ల ప్రతిభ ఉన్నవారికీ అన్యాయం జరుగుతోంది. యువతకు అవకాశాలు దొరకడం లేదు. మీ ఆశీర్వాదాలు, నమ్మకాన్ని వృథా కానివ్వను. ఇది మోదీ గ్యారంటీ. ప్రజల నమ్మకాన్ని వమ్ము కానివ్వను. వారసత్వ నేతలకు భయం పట్టుకుంది. ఆ పార్టీ నేతలు సొంత ఖజానా నింపుతున్నారు. కుటుంబ పాలకుల అవినీతి దళాన్ని వెలికితీస్తున్నా. దోచుకున్న నల్లధనం దాచుకోవడానికే విదేశాల్లో ఖాతాలు తెరిచారు అని అన్నారు.
మేమంతా మోదీ కుటుంబమే అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. రాష్ట్ర యువత కలలను సాకారం చేస్తా. 70 ఏళ్ల కాంగ్రెస్ చేయలేని పనిని పదేళ్లలో చేసి చూపాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. ఆ పార్టీలు కుమ్మక్కయ్యాయని ప్రజలందరికీ అర్థమైంది. కాళేశ్వరం పేరుతో రూ.కోట్లు దోచుకున్నారు. తెలంగాణలో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోంది. ప్రపంచానికి మనదేశం ఆశాకిరణంగా మారింది. భారత్ను సరికొత్త శిఖరాలను చేర్చాలి. ఇచ్చిన మాట ప్రకారం ఆర్టికల్ 370 రద్దు హామీలు అమలు చేశాం. అయోధ్య రామమందిరం నిర్మిస్తామని చెప్పాం. ప్రపంచం గర్వించే రీతిలో రాముడి ప్రతిష్ఠాపన జరిగింది అని అన్నారు.