స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ కు సవాలేనా..?

అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ అటు పార్లమెంట్ ఎన్నికల్లో హవా కొనసాగించింది. 8 పార్లమెంట్ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఊపు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడం …పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి కలిసొచ్చిందని చెప్పొచ్చు. అయితే.. ఇప్పటికే రెండు బిగ్ టాస్క్లను ఎదుర్కొన్న కాంగ్రెస్.. ఇప్పుడు అధికారిక హోదాలో మరో ఎన్నికల టాస్క్ను ఎదుర్కోబోతోంది. అవే స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద టాస్క్ కాబోతున్నాయి.
గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతీ జిల్లాల్లోనూ మెజార్టీ స్థానాల్లో వన్ సైడ్ తీర్పు వచ్చింది. చాలా పంచాయతీలపై గులాబీ జెండాలే రెపరెపలాడాయి. ఇంకా.. వందల సంఖ్యలో పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అవి కూడా బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. అయితే.. గతంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపిన దాఖలాలు లేవు. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడంతో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుందా..? లేదా..? అనే చర్చ జోరుగా సాగుతోంది.
లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటితేనే పార్టీకి మరింత బలం పెరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. అయితే.. అసెంబ్లీ ఎన్నికల వేళ బీసీ రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో కాంగ్రెస్ ప్రకటించింది. తన మేనిఫెస్టోలోనూ పొందుపరిచింది. కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలకవర్గాల సమయం ముగిసింది. గత జనవరి 31తోనే సర్పంచుల పదవీ కాలం ముగిసింది. దాంతో అప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు బీసీ రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థలు నిర్వహించాలని అటు ప్రతిపక్షాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి.
ఇటు ప్రభుత్వం పెద్దలు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. రిజర్వేషన్ అమలు చేశాకే ఎన్నికలకు పోతామని చెప్పారు. అయితే.. బీసీ రిజర్వేషన్లు అమలైతే రాష్ట్రంలో బీసీలకు స్థానాలు పెరుగుతాయి. బీసీ రిజర్వ్డ్ సంఖ్య పెరుగుతుంది. దాంతో ఈ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు కలిసి వస్తుందా..? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ రిజర్వేషన్లను ఆ పార్టీ ఏ మేరకు సద్వినియోగం చేసుకొని.. ఏ మేరకు ఫలితాలు సాధిస్తుందా..? అని జోరుగా చర్చ నడుస్తోంది.