డిసెంబర్ 9నే చేస్తామని చెప్పి.. ఇప్పుడు ఆగస్టు 15లోగా : కిషన్ రెడ్డి

రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు రైతులను మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ఆగస్టు 15లోగా అమలు చేస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు. సన్న వడ్లకే బోనస్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. రాష్ట్రంలో 80 శాతం దొడ్డు వడ్లనే పండిస్తారని తెలిపారు. చాలా తక్కువ మంది రైతులే సన్న రకం పండిస్తారని తెలిపారు. దొడ్డు వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. వాటిని కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఈ ప్రభుత్వం బోనస్ పేరుతో అన్నదాతలను మోసం చేసింది. కేంద్రం అన్ని రకాలుగా వారికి అండగా ఉంది. రబీ సీజన్లో పెద్ద మొత్తంలో ధాన్యం సేకరించాలని కేంద్రం ఒప్పందం కుదుర్చుకుందన్నారు.
గతంలో బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయి. ధాన్యం తడిచి మొలకెత్తుతున్నా, కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. మార్కెట్యార్డుల వద్ద అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం 75 వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొనేందుకు మరో 2 నెలలు పడుతుంది. వర్షాలు పడి ధాన్యం మొలకలు వస్తుంటే బాధ్యులు ఎవరు? ని ప్రశ్నించారు.