ఆ పార్టీలో చేరకుంటే అక్రమ కేసులు : హరీశ్రావు

ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేధించడమే పనిగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకుందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ పార్టీ చేరకుంటే అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని గాలికి వదిలేసింది. అక్రమ కేసులు పెట్టి మా ఎమ్మెల్యేలను గుంజుకునే ప్రయత్నం చేస్తోంది. వందల మంది పోలీసులు వెళ్లి వేకువజామున 3 గంటలకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలి. ఏదో ఒకవిధంగా జైలుకు పంపాలని చూస్తున్నారు. బెదిరించి లొంగదీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్నారు. అధికార పార్టీ నేతలకు అక్కడ క్రషర్లు ఉన్నాయి. వాటికి అనుమతులు లేకపోయినా నడుస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారు. మంత్రి ఆదేశాలతో మేం దాడులు చేస్తున్నామని స్వయంగా ఆర్డీవో తెలిపారు. ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్కు శిక్ష వేస్తాం అని అన్నారు.