ఆయన బతికి ఉంటే రామాలయ నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేది : జీవన్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ వస్తే అయోధ్య రామాలయాన్ని బుల్డోజర్తో కూల్చేస్తారనడం దారుణమన్నారు. ఇది మత విశ్వాసాలను రెచ్చగొట్టడమేనన్నారు. ప్రధాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుల్డోజర్ను తెర మీదకు తీసుకువచ్చింది బీజేపీనే అని వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామాలయం గేట్లు తెరిపించిందే రాజీవ్ గాంధీ ప్రభుత్వమని తెలిపారు. ఆయన బతికుంటే రామాలయం నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదని చెప్పారు. ఎన్నికల కోసం దేవుడిని వాడుకోవడం మంచిది కాదన్నారు.
మత సామరస్యానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నపుడు దూరదర్శన్లో రామాయణ, మహాభారతాలు ప్రసారం చేశారని వివరించారు. ప్రస్తుతం మోదీ వచ్చాకే రామ మందిర నిర్మాణనికి అంకురార్పణ జరిగింది అన్నట్లు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కోర్టు తీర్పు ప్రకారమే రామ మందిర నిర్మాణం జరిగిందన్నారు. మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం ఆ పార్టీ దేశాన్ని నాశనం చేస్తోందని మండిపడ్డారు.