నంద్యాల బరిలో శిల్పా?
కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వంపై రేగిన వివాదం కొలిక్కి వచ్చినట్లు పార్టీ శ్రేణులు ద్వారా తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే తన రాజకీయ భవిష్యత్తుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీలో ఉండి తీరుతానని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సృష్టం చేస్తున్నారు. మరోవైపు భూమా నాగిరెడ్డి మరణం నేపథ్యంలో టికెట్ తమ కుటుంబానికే దక్కాలని మంత్రి భూమా అఖిలప్రియ పట్టుదలతో ఉన్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా రెండోవర్గం నుంచి ఇక్కట్లు తప్పవని గ్రహించిన చంద్రబాబు వారం రోజుల్లో ఈ వివాదానికి తెరదించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. శిల్పా సోదరులతో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ పదవి ఇవ్వజూపినా శిల్పా నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో బాబు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తనపై నమ్మకం ఉంచాలని చెప్పి పంపినట్లు సమాచారం. ఒక దశలో పరోక్షంగా టికెట్ ఇవ్వడం ఖాయమని ఆయన సంకేతమిచ్చారని తెలుస్తోంది. దీంతో సంతృప్తి చెందిన శిల్పా సోదరులు పార్టీ మారాలన్న ఆలోచనను తాత్కాలికంగా పక్కనపెట్టి నియోజకవర్గంలోని తన కేడర్ను ఎన్నికలకు సిద్దం చేసే పనిలో నిమగ్నం కావాలని నిర్ణయానికి వచ్చారని టిడిపి జిల్లా నేతల ద్వారా తెలుస్తోంది.













