సీఎం చంద్రబాబుకు శబరిమల ఆలయ చైర్మన్ ఆహ్వానం
శబరిమల అయ్యప్పస్వామి దేవాలయ ప్రాంగణంలో జూన్ 25న బంగారు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా హాజరవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆహ్వానం అందింది. బంగారు ధ్వజస్తంభాన్ని బహుకరించిన ఫినిక్స్ గ్రూపు ప్రతినిధులు చుక్కపల్లి సురేష్, చుక్కపల్లి రమేష్, ట్రావెన్కోర్ దేవస్థానం ట్రస్టుబోర్డు అధ్యక్షుడు గోపాలకృష్ణన్ సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానించారు. నూతన బంగారు ధ్వజస్తంభం విలువ రూ.4.5 కోట్లుగా పేర్కొన్నారు. అనేక దశాబ్దాలుగా ఆలయం ముందున్న ధ్వజస్తంభాన్ని తొలగించినట్లు గోపాలకృష్ణన్ తెలిపారు. శబరిమల ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న సదుపాయల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఒకేసారి నాలుగు వేల మంది భక్తులకు అన్నదానం చేసేందుకు అన్నదాన మండపం ఉందని, భక్తులకు అన్నదానం కోసం మేలురకం బియ్యం, పప్పులు ఆంధ్రప్రదేశ్ నుంచి కొనుగోలు చేస్తున్నామని గోపాలకృష్ణన్ తెలిపారు.













