Nara Lokesh: ప్రాణత్యాగం చేసి కోట్లాది మంది తెలుగు వారికి దారిచూపిన వ్యక్తి పొట్టి శ్రీరాములు: నారా లోకేష్

పొట్టి శ్రీరాములు గారి స్మృతివనం ఏర్పాటుకు అన్ని విధాల సహకరిస్తాం
విగ్రహం ఏర్పాటు కేవలం కమిట్ మెంట్ మాత్రమే కాదు.. నాకో ఎమోషన్!
ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని అనుకున్నది సాధించాలి
అమరావతిలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం, స్మృతివనం, ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్
అమరావతిః ప్రాణత్యాగం చేసి కోట్లాది మంది తెలుగువారి దారిచూపిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని, పొట్టి శ్రీరాములు గారి స్మృతివనం ఏర్పాటుకు అన్ని విధాల సహకారం అందిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం, అమరజీవి పొట్టి శ్రీరాములు మమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరావతిలోని తుళ్లూరు-పెదపరిమి మధ్య ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల విస్తీర్ణంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహంతో పాటు ఆడిటోరియం, స్మృతివనం నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళలు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. పొట్టి శ్రీరాములు గారిపై రూపొందించిన ఏవీని వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి లోకేష్ ప్రసంగిస్తూ.. వాసవీమాతాకి జై. మహాత్మాగాంధీ గారు దేశానికి స్వాతంత్ర్యం సాధిస్తే.. పొట్టి శ్రీరాములు గారు తెలుగుజాతికి గుర్తింపు సాధించిన వ్యక్తి. గాంధీ గారిని ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే.. పొట్టి శ్రీరాములు గారిని ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అంటారు. కొన్నిదీపాలు వెలుగునిస్తాయి. కొన్ని దీపాలు దారిచూపిస్తాయి. ప్రాణత్యాగం చేసి కోట్లాది మంది తెలుగు ప్రజల కోసం దారిచూపించిన దీపం పొట్టి శ్రీరాములు గారు. ఈ రోజు ఆయన 58 అడుగుల విగ్రహం ఏర్పాటుకోసం మనందరం శంకుస్థాపన చేసేందుకు వచ్చాం. విగ్రహంతో పాటు ఆడిటోరియం, మెమోరియల్, మ్యూజియం, మినీ ధియేటర్ ను 6.8 ఎకరాల్లో మన అమరావతి ప్రజా రాజధానిలో ఏర్పాటుచేసేందుకు ఇక్కడకు విచ్చేశాం.
పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది
కేవలం విగ్రహం ఏర్పాటు మాత్రమే కాకుండా.. మొత్తం ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత తీసుకోవాలని డూండి రాకేష్ ను కోరుతున్నా. 58 అడుగుల విగ్రహం ఎందుకు అని మనం అనుకోవచ్చు. దీనివెనుక చరిత్ర ఉంది. పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆయన ప్రాణత్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దీంతో పాటు నెహ్రూ గారు ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటుచేశారు. ఆ కమిషన్ వల్ల తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి. పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భాషా ప్రయుక్త రాష్ట్రాలు మనదేశంలో ఏర్పడ్డాయి.
సమాజంలో మార్పు కోసం అహర్నిశలు పోరాడారు
ఆయన ఆమరణ నిరాహార దీక్ష వల్ల దేశంలోనే పెను మార్పులువచ్చాయి. ఆయన కేవలం భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసమే పోరాడలేదు. సమాజంలో మార్పు కోసం అహర్నిశలు పోరాడారు. మన దళిత సోదరులు ఆలయ ప్రవేశం కోసం పోరాడారు. వివిధ సామాజిక అంశాలపై ఐదు సార్లు నిరాహార దీక్షలు చేశారు. ఆయన ఏకంగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లి గాంధీ తాత దగ్గర నుంచి అహింసను ఆయుధంగా చేసుకున్నారు. గాంధీ తాతనే పొట్టి శ్రీరాములు లాంటివారు పది మంది ఉంటే చాలు.. దేశానికి స్వాతంత్ర్యం ఒక్క ఏడాదిలోనే వచ్చేదని చెప్పారు.
నమ్ముకున్న సిద్ధాంతం కోసం జీవితం త్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు
నాలా లాంటి చాలా మంది మార్కుల కోసం పొట్టి శ్రీరాములు గారి గురించి పాఠ్యాంశాల్లో చదువుకున్నాం. కానీ ఆయన చేసిన కార్యక్రమాల వెనుక ఎంతో ఆలోచన, త్యాగం ఉందని గమనించాలి. మనం చాలా నేర్చుకోవాల్సి ఉంది. నమ్ముకున్న సిద్ధాంతం కోసం జీవితం త్యాగం చేశారు. ఈ రోజు ఒక్క మార్కు తక్కువ వస్తే ఆత్మహత్యలు చేసుకునే రోజులు. పొట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి పట్టుదల, కమిట్ మెంట్ నేర్చుకోవాలి. మనం ఏదైనా సాధించాలనుకుంటే తొలి అడుగు వేస్తే సమాజం మొత్తం మన వెనుక ఉంటుంది. ఇప్పుడు ప్రదర్శించిన వీడియోలో చూశాం. ఆయన దీక్షకు కూర్చొన్నప్పుడు చాలామంది రాలేదు. ఎప్పుడైతే ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టిందో ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆయన వెనుక వచ్చింది. చివరకు అంత్యక్రియలకు కూడా ఎవరినీ రానివ్వకుండా చేస్తే ఆనాటి పెద్దలు చేసే పరిస్థితి.
పొట్టి శ్రీరాములు గారిని స్ఫూర్తిగా తీసుకుని అనుకున్నది సాధించాలి
ఇన్ని దశాబ్దాలైనా ఈ రోజు ఆయన్ను గుర్తుచేసుకుంటున్నామంటే.. ఆయన చేసిన త్యాగం వల్లే. మనం ఏ కార్యక్రమం చేసిన ఆయన్ను గుర్తుచేసుకోవాలి. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని మనం అనుకున్నది సాధించాలి. పొట్టి శ్రీరాములు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి కొణిజేటి రోశయ్య గారు నాకు గుర్తుకువస్తారు. రోశయ్య తాత ఎప్పుడైతే గవర్నర్ అయ్యారో ఏడాదికోసారి ఆయనతో మాట్లాడేవాడిని. రాజకీయాల్లో మీరు లేని లోటు తెలుస్తోందని ఆయనతో చెప్పా. మిమ్మల్ని చూసి పెరిగానని, ఏవిధంగా అసెంబ్లీలో పోరాడారో.. రాజశేఖర్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి మధ్య యుద్ధం జరుగుతుందంటే ఒక్కమాటతో దానిని చల్లబరిచేవారు, అది మీ గొప్పతనం, రాజకీయాల్లో ఇప్పుడు లేకుండా పోయిందని చెప్పాను.
పొట్టి శ్రీరాములు గారి చరిత్రపై రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది
రాష్ట్రం కోసం చాలా మంది పనిచేశారు. వారిని మనం గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు స్మృతివనం ద్వారా మనం కేవలం వీడియోస్, ఫోటోస్ మాత్రమే కాకుండా ఒక చైయిర్ కూడా ఏర్పాటుచేసి పొట్టి శ్రీరాములు గారు సమాజానికి ఏవిధంగా పనిచేశారో, దానిపై రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి వేదికపై ఉన్న పెద్దల సహకారం కోరుతున్నా. ఇప్పుడు ప్రదర్శించిన వీడియోలో పెద్దగా ఫోటోలు లేవు. ఆయన ఫోటోలన్నీ సేకరించాలి. లైబ్రరీ నుంచి బుక్స్ తీసుకువచ్చి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. స్మృతివనం నిర్మించడమే కాదు.. ఒక చైయిర్ ఏర్పాటుచేసి ఆయన చరిత్రపై రీసెర్చ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది.
విగ్రహం ఏర్పాటు కేవలం కమిట్ మెంట్ మాత్రమే కాదు.. నాకో ఎమోషన్!
పాదయాత్ర చేస్తున్నప్పుడు అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుచేయాలని ఆర్యవైశ్య సోదరులు కోరారు. అప్పుడే హామీ ఇవ్వడం జరిగింది. ఇది కమిట్ మెంట్ మాత్రమే కాదు.. ఇది నాకో ఎమోషన్. చేయాలనే తపన. పాదయాత్రలో మిమ్మల్ని కలిసిన తర్వాతనే ఆయన గురించి తెలుసుకున్నాను. అందుకే ఒక ఎమోషన్ తో మేం అందరం పనిచేస్తున్నాం. అన్నిరకాలుగా ట్రస్ట్ కు మేం సహకరిస్తాం, నిలబడతాం. కలిసికట్టుగా ముందుకు వెళ్లి ఎవరూ ఊహించనట్లుగా అద్భుతమైన స్మృతివనం ఏర్పాటుచేయాలని కోరుకుంటున్నాను. అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు.
ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ.. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ప్రతిష్టించాలని, ఆడిటోరియం నిర్మించాలని చంద్రబాబు గారిని, మంత్రి నారా లోకేష్ ను కోరిన వెంటనే అంగీకరించారు. ఆ బాధ్యతను మంత్రి నారాయణ గారు మీద వేసుకుని సీఆర్డీయే అధికారులతో మాట్లాడి స్థలం కేటాయించారు. వాసవీ కన్యాకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరితే చంద్రబాబు గారిని ఒప్పించి, పెనుగొండ పంపించి పట్టువస్త్రాలు సమర్పించిన ఘనత ఎన్డీయే కూటమిది. పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం కోసం అమరావతి నడిబొడ్డున 6.8 ఎకరాల స్థలం కేటాయించారు. రాబోయే మార్చి 16న 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్ గారితో ఆవిష్కరింపజేస్తామని మాట ఇస్తున్నా.
మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ… మంత్రి లోకేష్ గారు గేమ్ చేంజర్. పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆవిష్కరించాలని రాకేష్ గారికి ఆలోచన రావడం గొప్ప విషయం. ఇందుకు ధన్యవాదాలు. మా టీజీవీ గ్రూప్ తరపున మొదటి విరాళం రూ.కోటి అందిస్తున్నాం. ఇతర ఏ సహకారం కావాలన్నా అందిస్తాం. గత ఎన్నికల్లో 95 శాతం మంది ఆర్యవైశ్యులు కూటమికి ఓటేశారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా నాకు కూడా మంచి శాఖ కేటాయించి గుర్తింపు ఇచ్చారు.
మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ.. హరిజనుల కోసం పొట్టి శ్రీరాములు గారు ఉద్యమాలు చేశారు. 58 రోజుల పాటు నిరాహార దీక్ష ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారు. అలాంటి వ్యక్తికి విగ్రహం ఏర్పాటుచేయాలని లోకేష్ గారు సీఎం గారికి చెప్పగా వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 6.8 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2026 మార్చి 16 నాటికి స్మృతివనం నిర్మాణం పూర్తిచేస్తామని చెబుతున్నారు. సీఆర్డీయే తరపున అన్ని విధాల సహకారం అందిస్తాం.
అనంతరం పొట్టి శ్రీరాములు గారి వారసులు నలుగురిని స్జేజి పైకి ఆహ్వానించి మంత్రి లోకేష్ వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంత్రి లోకేష్ కు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ పొట్టి శ్రీరాములు జ్ఞాపికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, టీజీ భరత్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.