తిరుమల శ్రీవారి సేవలో సీఎం రేవంత్ కుటుంబం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రేవంత్ రెడ్డి ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు. అనంతరం ఉదయం 8:30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నా. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించా. స్వామి వారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అని రేవంత్ ఆకాంక్షించారు.