YS Jagan: పరకామణి చోరీ చిన్న దొంగతనమా..? జగన్ పై చంద్రబాబు ఫైర్..!
తిరుమల శ్రీవారి పరకామణి చోరీని ‘చిన్న దొంగతనం’గా అభివర్ణిస్తూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని, జగన్కు దేవుడన్నా, భక్తులన్నా, ఆలయాల పవిత్రత అన్నా ఏమాత్రం లెక్కలేదని మండిపడ్డారు.
“బాబాయి హత్యనే సెటిల్ చేసుకుందామని చూసిన వ్యక్తి, ఇప్పుడు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పరకామణి చోరీని కూడా సెటిల్ చేయాలని చూడటం కంటే ఘోరం ఉంటుందా?” అని చంద్రబాబు ప్రశ్నించారు. దొంగతనం చేసిన వ్యక్తి డబ్బులు తిరిగి చెల్లించాడు కదా, తప్పేముందని జగన్ వాదించడం అనైతికమని అన్నారు.
“భక్తులు ఎంతో భక్తితో సమర్పించిన కానుకలు, ముడుపులను కొట్టేసిన దొంగలతో సెటిల్మెంట్ ఏంటి? రూ.72 వేలు అనేది చిన్న మొత్తమే కావచ్చు, కానీ దేవుడి హుండీలో చోరీ చేయడం చిన్న తప్పా? దాన్ని సెటిల్ చేయడం మహాపాపం కాదా?” అని చంద్రబాబు నిలదీశారు. కోట్ల మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడటం ఘోరమని, జగన్ వ్యాఖ్యలపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోందని తెలిపారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి మొహమాటాలకు తావులేదని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రశాంతంగా ఉండే ప్రాంతాలను సైతం నేరమయం చేసిందని, నేరస్తులను పెంచి పోషించిందని ఆరోపించారు. నెల్లూరులో లేడీ డాన్లు తయారవడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు.
-Srinivasa Mohan






