Sunitha Williams: సునీత విలియమ్స్ కోసం రాకకు మార్గం సుగమం..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రానున్నారు. అమెరికన్ అంతరిక్ష సంస్థ NASA- SpaceX ఆమెను, వ్యోమగామి బుచ్ విల్మోర్ను తిరిగి తీసుకురావడానికి ప్రయోగాన్ని ప్రారంభించాయి. స్పేస్ఎక్స్ శనివారం ఉదయం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు క్రూ-10 మిషన్ను ప్రయోగించింది. క్రూ డ్రాగన్ క్యాప్సూల్ను మోసుకెళ్లే స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ శనివారం ఉదయం 4.33 గంటలకు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా నలుగురు కొత్త వ్యోమగాములను ISS కి పంపింది. వీరిలో నాసాకు చెందిన అన్నే మెక్క్లెయిన్, నికోల్ అయర్స్, JAXAకి చెందిన టకుయా ఒనిషి, రోస్కోస్మోస్కు చెందిన కిరిల్ పెస్కోవ్ ఉన్నారు.
మూడు రోజుల క్రితం సాంకేతిక సమస్యతో స్పేస్ఎక్స్ క్రూ-10 మిషన్ ప్రయోగం వాయిదా పడింది శుక్రవారం తెల్లవారుజామున స్పేస్ఎక్స్ క్రూ-10 మిషన్ ప్రయోగించబోతున్న సమయంలో, ఫాల్కన్-9 రాకెట్ యొక్క గ్రౌండ్ సపోర్ట్ క్లాంప్ ఆర్మ్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషంలో మిషన్ను రద్దు చేశారు. అయితే ఇప్పుడు సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి తిరిగి రావడానికి మార్గం సుగమం అయ్యింది. మార్చి 19 నాటికి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరే అవకాశం ఉందని నాసా తెలిపింది.
అన్నీ అనుకూలిస్తే ఈ నెల 20 తర్వాత సునీత, బుచ్ భూమికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరు వ్యోమగాములు బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్ళారు. కానీ స్టార్లైనర్లో సాంకేతిక లోపం కారణంగా తిరిగి రాలేకపోయారు. 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ చిక్కుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే.






