Modi-Yunus: ఇండియాతో గేమ్స్ వద్దు.. యూనస్ కు మోడీ పరోక్ష హెచ్చరికలు…
Thailand: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి మహ్మద్ యూనస్, భారత ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. థాయ్లాండ్ బ్యాంకాక్లో 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నాయకులు సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సానుకూల, నిర్మాణాత్మక సంబంధం అవసరారన్ని ప్రధాని మోడీ యూనస్కి తెలియజేశారు. అదే సమయంలో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటాన్ని నివారించాలని కోరారని విదేశాంగ మంత్రి విక్రమ్ మిస్రీ విలేకరుల సమావేశంలో చెప్పారు.
మోడీ-యూనస్ భేటీలో బంగ్లాదేశ్తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ నిబద్ధతను ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. గతేడాది షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయినప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు జరిగాయి. ఈ దాడుల పట్ల భారత్ తన అభ్యంతరాన్ని బంగ్లాదేశ్కి తెలిపింది. దాడులను అడ్డుకోవాలని సూచించింది.
ఈ భేటీలో ”ప్రజాస్వామ్య, స్థిరమైన, శాంతియుత, ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్కు భారతదేశం మద్దతు ఇస్తుందని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. బంగ్లాదేశ్తో సానుకూల మరియు నిర్మాణాత్మక సంబంధాన్ని ఏర్పరచుకోవాలనే భారతదేశం యొక్క కోరికను ప్రొఫెసర్ యూనస్ కు నొక్కిచెప్పారు” అని మిస్రి అన్నారు. సరిహద్దు భద్రతపై ఇద్దరు నేతలు చర్చించారు. అక్రమ చొరబాటులను నిరోధించడానికి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రధాని మోడీ చెప్పారు. బంగ్లాదేశ్ లోని హిందువులు సహా మైనారిటీల భద్రతపై ప్రధాని తన ఆందోళన వ్యక్తం చేసినట్లు మిస్రీ వెల్లడించారు.
‘‘భారతదేశంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న ఏడు రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్గా ఉన్నాయి. వాటికి సముద్రాన్ని చేరుకునే అవకాశం లేదు. మొత్తం ఈ ప్రాంతానికి (ఈశాన్య భారతదేశం) కోసం మనం(బంగ్లాదేశ్) సముద్రానికి ఏకైక సంరక్షులం’’ అని యూనస్ చెప్పాడు. ఇది చైనాకు భారీ అవకాశాన్ని తెరుస్తుందని, ఇది చైనా ఆర్థిక వ్యవస్థ మరింత విస్తరించేందుకు సాయపడుతుందని, వస్తువుల్ని తయారు చేయండి, వాటిని మార్కెట్ చేయండి, చైనాకు తీసుకెళ్లండి లేదా ప్రపంచంలో మిగిలిన ప్రాంతాలకు ఎగుమతి చేయండి అని యూనస్ కోరాడు. దీనికి బిమ్స్ టెక్ సదస్సులో సమావేశం సందర్భంగా యూనస్ కు మోడీ పరోక్ష హెచ్చరికలు చేశారు.






