శంకుస్థాపనకు భారీగా విద్యుత్ ఏర్పాట్లు
అమరావతి శంకుస్థాపనకు విద్యుత్ సరఫరా ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళగిరి ఏడీఈ రాజేష్ఖన్నా మాట్లాడుతూ ఉండవల్లిలో రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ పనులు పూర్తికావొచ్చాయి. ఈ సబ్స్టేషన్ నుంచి మొత్తం నాలుగు ఫీడర్లు ఉంటాయాన్నారు. ఒక ఫీడరును ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రెస్ట్హౌస్కు అనుసంధానం చేస్తామన్నారు. రెండో ఫీడర్ను కృష్ణా పుష్కరాల ఏర్పాట్ల నిమిత్తం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మూడో ఫీడర్ను ఉండవల్లి, పెనుమాక గ్రామాల అవసరాల నిమిత్తం వినియోగిస్తామన్నారు. మరో ఫీడర్ను ముఖ్యమంత్రి రెస్ట్హౌస్కు ప్రత్యామ్నాయంగా భూగర్భ ఫీడర్గా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నవంబరులో ఉండవల్లి సబ్స్టేషన్ను ప్రారంభిస్తామన్నారు. మంగళగిరి మండల పరిషత్ ఆవరణలోని విద్యుత్శాఖ పాత కార్యాలయాల స్థానంలో రూ.5 కోట్ల వ్యయంతో ఇండోర్ విద్యుత్ సబ్స్టేషన్ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.













