అమెరికా వెళ్లే విద్యార్థులకు శుభవార్త… 14 నుంచి వీసాల

అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులకు శుభవార్త. ఈ నెల 14 నుంచి విద్యార్థి వీసా పక్రియను ప్రారంభించనున్నట్లు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో కాన్సులర్ వ్యవహారాల మంత్రి డాన్ హెఫ్లిన్ తెలిపారు. ఈ విషయాన్ని ఫేస్బుక్, ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో ప్రారంభమయ్యే తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు వీసాల జారీలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. పర్యాటక వీసాలైన బి1/బి2 కోసం ఎదురుచూస్తున్న వారు మరి కొంత కాలం వేచి ఉండకతప్పని పరిస్థితి. కరోనా రెండో దశ తీవ్రత నేపథ్యంలో అమెరికా వచ్చేవారి విషయంలో అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం, ముంబయి, చెన్నై, కోల్కతా, హైదరాబాద్ల లోని కాన్సులేట్ కార్యాలయాల్లో అత్యవసర వీసాలు మినహా ఇతర అన్నిరకాల వీసా సేవలను ఈ ఏడాది మే మూడో తేదీ నుంచి నిలిపివేసింది.
అమెరికాలో విశ్వవిద్యాలయాలు జులై, ఆగస్టు నెలల్లో ప్రారంభమవుతాయి. సాధారణంగా విశ్వవిద్యాలయం జారీ చేసే ఐ-20 పత్రంలో పేర్కొన్న తేదీకి 30 రోజులకు ముందుగా విద్యార్థులు అమెరికా వెళ్లేందుకు అవకాశం ఉండదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే వీసాలు పొందిన విద్యార్థులు ఆ గడువుతో సంబంధం లేకుండా అమెరికా వెళ్లవచ్చు. వీసాలేని వారు రాయబార, కాన్సులేట్ కార్యాలయాల్లో పూర్తిస్థాయి సేవలు ప్రారంభించేంత వరకు వేచి ఉండాల్సిందేనని అప్పట్లో అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో రాయబార కార్యాలయంతో పాటు నాలుగు కాన్సులేట్ కార్యాలయాల్లో వీసా పక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్లు కాన్సులర్ వ్యవహారాల మంత్రి డాన్ హెఫ్లిన్ పేర్కొన్నారు.