UPSC CSE Results: సివిల్స్ లో తెలుగు వాళ్ళ డామినేషన్

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్ – 2024 తుది ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు దుమ్ము రేపారు. శక్తి దుబే, హర్షిత గోయెల్, డోంగ్రే అర్చిత్ పరాగ్, షా మార్గి చిరాగ్, ఆకాశ్ గార్గ్, కోమల్ పూనియా, ఆయుషి బన్సల్, రాజ్కృష్ణ ఝా, ఆదిత్య విక్రమ్ అగర్వాల్, మయాంక్ త్రిపాఠి టాప్ 10 లో నిలిచారు. ఇక తెలుగు వారు కూడా సివిల్స్ లో తమ సత్తా చాటారు. పెద్ద ఎత్తున ర్యాంకులు సాధించారు.
సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి సత్తా చాటిన విద్యార్థుల లిస్టు ఒకసారి చూస్తే.. ఇ.సాయి శివాని 11వ ర్యాంకులో నిలవగా.. బన్నా వెంకటేశ్కు 15వ ర్యాంకు, అభిషేక్ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్కుమార్ రెడ్డి 62, సాయి చైతన్య జాదవ్ 68, ఎన్ చేతనరెడ్డి 110, చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి 119, చల్లా పవన్ కల్యాణ్ 146, ఎన్.శ్రీకాంత్ రెడ్డి 151, నెల్లూరు సాయితేజ 154, కొలిపాక శ్రీకృష్ణసాయి 190వ ర్యాంకులతో సత్తా చాటారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం 1056 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చారు.
జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్షను యూపీఎస్సీ నిర్వహించగా.. ఇందులో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. మెయిన్స్లో సత్తా చాటిన వారికి జనవరి 7 నుంచి ఏప్రిల్ 17వరకు దశల వారీగా పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. తాజాగా వాటి ఫలితాలను వెల్లడించారు. ఈ ఫలితాల్లో 1,009 మందిని యూపీఎస్సీ(UPSC) ఎంపిక చేసింది. జనరల్ కేటగిరీలో 335 మంది నిలవగా.. ఈడబ్ల్యూఎస్ నుంచి109, ఓబీసీ నుంచి 318, ఎస్సీ కేటగిరీలో 160, ఎస్టీ కేటగిరీ నుంచి 87మంది చొప్పున నిలిచారు.