Rajnath Singh : రక్షణ శాఖ కీలక ప్రకటన

రక్షణరంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ల ఎగ్జిక్యూషన్ మోడల్ను సిద్ధం చేయడానికి మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) ఆమోదం తెలిపారు. ఇతర సంస్థల భాగస్వామ్యంతో బెంగళూరులోని డీఆర్డీవో (DRDO) ఏరో నాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ( ఏడీఏ) దీనిని అమలు చేయనుంది. అమ్కా(AMCA)ను రూపొందించడంలో ఈ ప్రక్రియ కీలక మైలురాయిగా నిలవనుంది.భారత్ దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఐదో తరం యుద్ధ విమానం అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాప్ట్ (అమ్కా) నమూనాను తొలిసారి ఏరో ఇండియా-2025లో ప్రపంచానికి చూపించారు. కృత్రిమ మేధ ( ఏఐ) అధారిత ఎలక్ట్రానిక్ పైలట్ (Electronic pilot) , నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థల వంటి ప్రత్యేకతలు ఈ విమానం సొంతం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థంగా సత్తా చాటుతుంది. 25 టన్నుల బరువు ఉండే ఈ లోహ విహంగాన్ని మావన సహితంగా, మానవ రహితంగా పనిచేసేలా రూపొందించనున్నారు. ఏడీఏ (ADA) దీని డిజైన్ను రూపొందించింది. హైదరాబాద్ (Hyderabad) కు చెందిన వేమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ఫ్యాబ్రికేషన్ పనులు చేసింది.