Kamal Haasan :రాజ్యసభకు కమల్హాసన్

మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan ) రాజ్యసభ (Rajya Sabha) కు వెళ్లనున్నారు. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎంఎన్ఎంకు ఎగువసభ స్థానం కేటాయించారు. ఈ విషయాన్ని డీఎంకే-ఎంఎన్ఎం ఖరారు చేశాయి. ఎనిమిది రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు (Tamil Nadu) లో ఆరు, అస్సాం (Assam)లో రెండు సీట్లు వీటిల్లో ఉన్నాయి. విపక్ష ఇండియా కూటమిలో ఎంఎన్ఎం భాగం. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని 39 లోక్సభ స్థానాలు, పుదుచ్చేరి (Puducherry) లోని ఒక స్థానంలో ఎంఎన్ఎం ప్రచారం చేసింది. 2025 ఎగువసభ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. కమల్ హాసన్ 2018లో ఎంఎన్ఎం పార్టీని స్థాపించారు. అవినీతి, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు, గ్రామాల సాధికారత కోసం దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.