నూతన సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం

దేశ సర్వోన్నత న్యాయస్థానం 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఫ్ువాల్ తెలిపారు. తన పదవీ కాలం నవంబరు 10న ముగియనున్న నేపథ్యంలో ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. నూతన సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబరు 11న ప్రమాణం చేయనున్నట్లు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఫ్ువాల్ తెలిపారు. 2025 మే 13 వరకు జస్టిస్ ఖన్నా సీజేఐగా కొనసాగుతారు.