Bihar: జేడీయూ, ఆర్ఎల్డీల్లో వక్ఫ్ కల్లోలం.. పార్టీలకు మైనార్టీ నేతల రాజీనాామాలు..

బీహార్ (Bihar) లో ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఇలాంటి కీలక తరుణంలో వక్ఫ్ బిల్లుకు మద్దతు ప్రకటించడం జేడీయూలో సంక్షోభాన్ని రేపింది. బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ (JDU) వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీకి చెందిన మైనారిటీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా, మరో నేత పార్టీని వీడారు. ఆ పార్టీ యూత్ వింగ్ ఉపాధ్యక్షుడు తబ్రేజ్ హసన్ పార్టీకి రాజీనామా చేశారు. తబ్రేజ్ రాజీనామాకు ముందు, జెడియు మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ షానవాజ్ మాలిక్, అలీఘర్ నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ తబ్రేజ్ సిద్ధిఖీ, భోజ్పూర్కు చెందిన సభ్యుడు మొహమ్మద్ దిల్షాన్ రైన్, మాజీ అభ్యర్థి మొహమ్మద్ ఖాసిం అన్సారీ పార్టీకి గుడ్ బై చెప్పారు.
తబ్రేజ్ తన రాజీనామా లేఖను శుక్రవారం పార్టీ అధినేత నితీష్ కుమార్కి పంపారు. బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా ముస్లింల విశ్వాసాన్ని దెబ్బతీశారని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ‘‘మీరు మీ లౌకిక ఇమేజ్ను కొనసాగిస్తారని ఆశించాను, కానీ ముస్లింలకు వ్యతిరేకంగా పదేపదే పనిచేసిన శక్తులతో నిలబడాలని మీరు ఎంచుకున్నారు’’ అని లేఖలో పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ , పౌరసత్వ సవరణ చట్టం వంటి చర్యల తర్వాత ఏన్డీయే ప్రభుత్వం వక్ఫ్ బిల్లును తీసుకువచ్చిందని, ఇది ముస్లిం ప్రయోజనాలకు హాని కలిగిస్తుందన్నారు.
మరోవైపు, ఎన్డీయే మరో మిత్రపక్షమైన ఆర్ఎల్డీలో కూడా ఇలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ఆర్ఎల్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షాజాయిబ్ రిజ్వి శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ చీఫ్ జయంత్ చౌదరి “లౌకికవాదాన్ని విడిచిపెట్టారని”, ముస్లింలకు మద్దతు ఇవ్వడంలో విఫలమయ్యారని ఆయన తన రాజీనామా లేఖలో ఆరోపించారు. ముస్లింలు జయంత్ చౌదరికి మద్దతు ఇచ్చారని, కానీ ఈ సమయంలో మాతో నిలబడలేదని రిజ్వీ ఆరోపించారు..