Modi: ఉగ్రవాదులు, వారి మద్దతుదారులపై కఠిన చర్యలు : మోదీ

ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు అని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భారత్ పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సో (Juan Lorenzo) తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అనంతరం వీరిద్దరూ కలిసి సంయుక్త మీడియా సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) ఘటనను మోదీ ప్రస్తావించారు. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు. పహల్గాం దాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదంపై భారత్ (India) చేస్తున్న పోరాటానికి అంగోలా (Angola) మద్దతు పలికింది. అందుకు ఆ దేశానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చేవారిపై కఠినమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి మేం కట్టుబడి ఉన్నాం అని మోదీ పునరుద్ఘాటించారు.