కీలక నిర్ణయం తీసుకున్న అదానీ పోర్ట్స్ … నవంబర్ 15 నుంచి
అదానీ పోర్ట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ దేశాలకు సంబంధించిన సరకు రవాణాను తమ టెర్మినళ్ల నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 15 నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు తెలిపింది. ఇటీవల గుజరాత్లోని అదానీ గ్రూప్ నడిపే ముంద్రా పోర్ట్లో 3 వేల కిలోల హెరాయిన్ సీజ్ పట్టుబడిన విషయం తెలుసు కదా. దీని విలువ సుమారు రూ.20 వేల కోట్లు ఉంటుందని అంచనా.
గత నెలలో దొరికిన డ్రగ్స్ కన్సైన్మెంట్ ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చింది. ప్రపంచంలో అతిపెద్ద అక్రమ ఒపియం రవాణాదారుల్లో ఒకటి ఆప్ఘనిస్థాన్కు పేరుంది. ప్రాసెస్ చేయని టాల్కమ్ పౌడర్ అంటూ పెద్ద పెద్ద బ్యాగులలో ఈ హెరాయిన్ను తరలించారు. పైన టాల్కమ్ పౌండర్ రాళ్లను పెట్టి, కింది భాగంలో డ్రగ్స్ ఉంచారు. ఈ భారీ అక్రమ రవాణా వెలుగు చూసిన తర్వాత దేశవ్యాప్తంగా సోదాలు జరిగాయి. ఆఫ్ఘన్, ఉజ్బెకిస్తాన్లకు చెందిన 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అదానీ గ్రూప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి ప్రమేయం కూడా ఉండడంతో తెలుగునాట సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించింది.






