Dunky Route : డంకీ మార్గంలో అమెరికాకు.. ఇద్దరు భారతీయుల కిడ్నాప్
డంకీ ( అక్రమ) మార్గంలో అమెరికాకు వెళ్తున్న ఇద్దరు భారతీయులు (Indians) గ్వాటెమాలాలో అపహరణకు గురయినట్లు తెలుస్తోంది. వారిని విడిచిపెట్టేందుకు 20 వేల డాలర్లు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు బాధిత కుటుంబాలు వాపోతున్నట్లు తెలిసింది. అపహరణకు గురైనవారిలో హరియాణా (Haryana)కు చెందిన యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ఒకరు. ఆయన తండ్రి కుల్దీప్ సింగ్ (Kuldeep Singh ) మాట్లాడుతూ నా కుమారుడు అమెరికాకు వెళ్లేందుకు ఓ ఏజెంటుతో రూ.41 లక్షలకు డీల్ కుదిరింది. తొలుత రూ.2 లక్షలు చెల్లించాం. మిగతా ఆ దేశానికి వెళ్లాక ఇవ్వాలనేది ఒప్పందం. అయితే మధ్యలోనే మరో 14 లక్షలు తీసుకున్నారు. అమెరికా బయలుదేరిన తర్వాత యువరాజ్ నుంచి ఫోన్కాల్స్ రాలేదు. ఫోన్ నెట్వర్క్ లేని ప్రాంతాల నుంచి వెళ్తున్నారని, ఆ దేశం చేరుకున్నాక మాట్లాడవచ్చని ఏజెంట్లు భరోసా ఇచ్చారు. అయితే కిడ్నాపర్ల నుంచి మాకు ఇటీవల ఒక వీడియో వచ్చింది. అందులో కొందరు వ్యక్తులు యువరాజ్ను చిత్రహింసలు చేస్తూ తుపాకీ చూపించి బెదిరిస్తున్నారు. అతణ్ని విడిచిపెట్టాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు అని వివరించారు. కిడ్నాపుకు గురైన మరో వ్యక్తి పంజాబ్ (Punjab)లోని హూషియాపూర్ జిల్లాకు చెందినవారు. ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. వీరి ఫిర్యాదు మేరకు ట్రావెల్ ఏజెంట్లపై స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమ కుమారులను భారత ప్రభుత్వం రక్షించాలని బాధిత కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.






