Jyothi Malhotra: ఐఎస్ఐ ఏజెంట్ తో పెళ్లి.. పాక్ లో సెటిల్మెట్.. జ్యోతి మల్హోత్రా పెద్ద ప్లాన్సే వేసిందిగా..?

పాకిస్థాన్కు గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Youtuber Jyoti Malhotra) కేసు విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్తాన్ ఏజెంట్లతో టచ్ లో ఉన్న జ్యోతి.. చాలా పెద్ద ప్లాన్లే వేసింది. ఏకంగా ఐఎస్ఐ ఏజెంట్ ను పెళ్లాడి, అక్కడే సెటిల్ అయ్యేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించి ఐఎస్ఐతో సంబంధాలున్న హసన్ అనే వ్యక్తితో ఆమె గతంలో చేసిన చాటింగ్ వివరాలు తాజాగా బయటకొచ్చాయి.
పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న అలీ హసన్తో ఆమె నిరంతరం టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. కోడ్ భాషలో ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. తాజాగా అవన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తనను పాకిస్థాన్లోనే వివాహం చేసుకోవాలని జ్యోతి కోరింది. దీంతో పాటు భారత్కు సంబంధించిన రహస్య కార్యకలాపాల గురించి కూడా చర్చించారు. అంతేకాదు…ఆమెకు నాలుగు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని.. దుబాయ్ నుంచి వాటిలో డబ్బు జమ అవుతోందని దర్యాప్తులో తేలినట్లు సమాచారం. దీనిపై మరింత లోతుగా విచారణ కొనసాగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో (Travel With Jo) పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తోంది. 2023లో పాక్కు వెళ్లిన సమయంలో డానిష్ ఆమెకు పరిచయమయ్యాడు. భారత్కు వచ్చిన తర్వాత కూడా అతడితో కాంటాక్టు అయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అతడి సూచన మేరకు.. అలీ అనే వ్యక్తిని ఆమె కలిసింది. అతడు పాక్ నిఘా, రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను జ్యోతికి పరిచయం చేసినట్లు సమాచారం. దేశ రక్షణకు చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్ వ్యక్తులకు చేరవేసినట్లు అధికారులు ఆరోపించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా భారత్లో నిలిపివేశారు.