భిన్న వాతావరణ పరిస్థితులతో … అమెరికా అతలాకుతలం
ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు భారీ వర్షాలు అమెరికాను అతలాకుతలం చేస్తున్నాయి. అధిక ప్రాంతాల్లో ఎండలు విజృంభించగా, సౌత్ డకోటాలో మాత్రం వరదల ధాటికి ఒకరు మృతి చెందడం గమనార్హం. ఆగ్నేయ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోత కొనసాగొచ్చనీ, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరించింది. సౌత్ డకోటా, అయోవా, మిన్నెసొటా తదితర ప్రాంతాల్లో వరదల ప్రభావం ఉంటుందని వెల్లడిరచింది. వర్ష భీభత్సంతో భారీ రైల్వే వంతెన కూలి సియోక్స్ నదిలో పడిపోయినట్లు ఓ అధికారి తెలిపారు.
అయోవా నగరంలో రెండు రోజు సైతం కర్ఫ్యూ కొనసాగింది. ఉత్తర అయోవాకు చెందిన 21 కౌంటీల్లో ప్రస్తుత వరదలను ఓ విపత్తుగా అధికారులు ప్రకటించారు. కొన్ని చోట్ల సాధారణం కంటే ఎనిమిది రెట్ల వర్షపాతం నమోదైంది. సియోక్స్ కౌంటీ చుట్టుపక్కల నగరాల్లో కేవలం మూడు రోజుల్లోనే దాదాపు 25 నుంచి 38 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు ప్రకటించారు.మిస్సోరీ నదీ తీరం వెంబడి వరదలు వచ్చే ప్రమాదం ఉందనీ, ప్రజల అప్రమత్తంగా ఉండాలన్నారు. వాషింగ్టన్ డీసీ, బాల్టిమోర్, ఫిలడెల్ఫియాల్లో మాత్రం రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.






