అమెరికాను వణికిస్తున్న ట్రిపుల్ ఈ వైరస్
అరుదైన దోమల ద్వారా సంక్రమించే వైరస్తో అమెరికా వణికిపోతున్నది. ఈ వైరస్ సోకిన ఘటనలో ఈ ఏడాది తొలి మరణం నమోదైంది. ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సెఫలైటిస్ (ఈఈఈ)గా పేర్కొంటున్న ఈ వైరస్ బారిన పడిన ఒక వ్యక్తి న్యూ హాంప్షైర్లో చనిపోయినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. ఈ రాష్ట్రంలో దశాబ్దకాలంలో జరిగిన తొలి వైరస్ మరణం అని, అమెరికాలో ఈ ఏడాది గుర్తించిన ఐదో కేసు అని అధికారులు పేర్కొన్నారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈవైరస్కు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. న్యూ హాంప్షైర్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో దోమల వైరస్ ప్రబలినట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రామైన మసాచ్చుసెట్స్లోని పలు ప్రాంతాలు ఈ వైరస్ కారణంగా హై అలర్ట్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ట్రిపుల్ ఈ వైరస్ అరుదైనది కానీ తీవ్రమైనదిగా అధికారులు చెప్తున్నారు.






